Monday, May 18, 2015

తల్లయితే.. బాధ్యతలే కాదు

మాతృత్వన్ని వాయిదా వేసే యువతులకు శుభవార్త.. తల్లయితే.. బాధ్యతలే కాదు.. తెలివి పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి శాస్త్రీయ పరిశోధనలు. అమ్మ కాగానే పెద్దరికాన్ని ఆపాదించుకున్న మహిళల శక్తి సామర్థ్యాలు శాస్త్రీయంగా
నిరూపితమైనవి. తల్లయిన తరువాతే స్త్రీ మెదడు కణాల్లో గొప్పమార్పు రావడంతో పాటు తల్లుల్లో తెలివితేటలు పెరుగుతాయని ఒక పరిశోధనలో స్పష్టమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చురుకుదనం తగ్గి బాధ్యతలు పెరుగుతాయని చాలామంది యువతులు భయపడుతారు. ప్రసవానంతరం తల్లిలో చోటుచేసుకునే మార్పు బిడ్డను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడానికి, సంరక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శిశువు పుట్టిన కొన్ని వారాలు, నెలలు గడిచేసరికి తల్లి మెదడులోని కణాల్లో చైతన్యశక్తి ఇనుమడించి మేధస్సు పెరుగుతున్నదని ఈ పరిశోధనల్లో గుర్తించారు అమ్మల తెలివితేటలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు. 
         అమెరికాలోని న్యూరో సైంటిస్టులు కొందరు తల్లుల మెదళ్ళను స్కాన్‌ చేశారు. శిశువుకు జన్మనిచ్చిన కొన్ని వారాల తరువాత మెదడు స్కాన్‌ తీయగా గ్రే మ్యాటర్‌ పరిమాణం కొంత పెరిగినట్లు గమనించారు. మరో నాలుగైదు నెలల తరువాత స్కాన్‌ తీయగా.. మెదడు పరిమాణం మరింత పెరిగింది. తల్లుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సైతం పరిశోధకులు గుర్తించారు. 
                ప్రసవం తరువాత ఆడవారు శారీరకంగా పరిపూర్ణ స్త్రీత్త్వాన్ని సంతరించుకోవడంతో పాటు మానసికంగా ఎదుగుతారన్నది వాస్తవం. శిశువుకు జన్మనీయడంతో హర్మోనల్లో వచ్చే మార్పు కారణంగా మెదడు రీచార్జ్‌ అవుతుంది. బిడ్డ ఆలనాపాలనా చూడేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు చేకూరుతాయి. మెదడు కణాల్లో వచ్చే మార్పుతో తల్లికి, బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

No comments:

Post a Comment