Wednesday, August 7, 2013

ఆర్బీఐ గవర్నర్ గా సంస్కరణల రా'రాజు'

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ దువ్వూరి
సుబ్బారావు స్థానంలో 23వ గవర్నర్ గారఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. యాభై ఏళ్ల ఈ ఆర్థిక వేత్త.. ప్రస్తుతం భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. కొత్త ఆర్బీఐ గవర్నర్ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకోవడం, వృద్ధిరేటును పెంచడం, కరెంటు ఖాతా లోటును పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం వంటివి కీలక అంశాలు. వీటికోసం ఈయన ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.
గ్లోబల్ ఫైనాన్స్ పెట్టుబడులకు విధేయుడు..
  
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ ద్రవ్య వ్యవస్థను శాసిస్తోంది. ఆర్థిక వ్యవస్థకు దశను, దిశను నిర్దేశిస్తోంది. ఇలాంటి.. కీలక సంస్థకు గవర్నర్‌గా 2003లో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన రఘురాం రాజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికీ.. ఈయన ప్రపంచ బ్యాంక్‌ ప్రొఫెసర్‌. ఆర్థిక సంస్కరణలకు, ద్రవ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారుడైన రఘురాం రాజన్‌ నియామకం ద్వారా.. సంస్కరణల వేగాన్ని పెంచాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా నియమితుడైన రఘురాం రాజన్‌ దేశ, విదేశీ కార్పొరేట్‌ రంగానికి బలమైన మద్దతుదారుడు. గ్లోబల్‌ ఫైనాన్స్ పెట్టుబడులకు నమ్మకమైన విధేయుడు. మన్మోహన్‌ సింగ్‌, చిదంబరం, మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాలకు ఇప్పుడిక రఘురాం రాజన్‌ తోడవుతున్నారు.
బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులు..
   
బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించడానికి యుపిఏ సర్కారు ఉరుకులు పరుగులు తీస్తోంది. విదేశీ బ్యాంకులను ప్రోత్సహించాలని గతంలోనే రఘురాం రాజన్‌ నేతృత్వంలోని కమిటీ సూచించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరించాలన్నది ఈయన నమ్మే ఆర్థిక నీతి. ప్రయివేటీకరణకు ముద్దుపేరే పెట్టుబడుల ఉపసంహరణ. వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు లాంటి వాటికి ప్రాధాన్యతా రుణసదుపాయం ఉండాలన్నది ప్రభుత్వ రంగ బ్యాంకుల విధానం. కానీ.. ఈయన మాత్రం ఇలాంటి సదుపాయం తొలగించాలని గతంలోనే సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై ఫైనాన్స్ పెట్టుబడుల స్వైర విహారం..
    
గ్లోబల్‌ ఫైనాన్స్ పెట్టుబడులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై గద్దల్లా వాలి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలను ఫైనాన్స్ పెట్టుబడుల స్వైర విహారం నుంచి కాపాడాల్సిన సమయమిది. కాలు నిలవని విదేశీ పెట్టుబడులు రూపాయిని పాతాళానికి నొక్కేస్తున్నాయి. కానీ.. కొత్తగా ఆర్‌బిఐ బాస్‌ కాబోతున్న రఘురాం రాజన్‌ మాత్రం ఈ సీతాకొక చిలుకల్లాంటి పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరవాలని చెప్పే పెద్ద మనిషే. బ్యాంకుల నుంచి బాండ్ల మార్కెట్లోకి అన్నిట్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు బారుగా తీయాలన్నదే ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌ నమ్మకం. చివరకు పెట్టుబడులపై ఎలాంటి నియంత్రణలు ఉండొద్దని రఘురాం రాజన్‌ వాదిస్తారు.
వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం..
   
ఆర్థిక మాంద్యం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. వృద్ధిరేటు దెబ్బతింటోంది. ఈ సమయంలో కావాల్సింది ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తన పాత్ర పెంచాలి. మౌలిక వసతుల నుంచి సామాజిక రంగాల వరకు ప్రభుత్వ వ్యయం పెరగాలి. కానీ కొత్త ఆర్‌బిఐ గవర్నర్‌ ఇందుకు ససేమిరా అంటాడు. అనేక రంగాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గాలంటారు. ప్రభుత్వ వ్యయంపై కోత విధించాలంటారు. చివరకు గతంలో యుపిఎ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రైతుకు రుణాలను మాఫీ చేస్తే వ్యతిరేకించిన చరిత్ర ఆయనది.
చుక్కలనంటుతున్న ఆహార ధరలు..
   
ఆహార ధరలు చుక్కలనంటుతున్నాయి. అనేక కారణాలతో పాటు ఆహారోత్పత్తుల రంగంలో స్పెక్యులేటివ్‌ ధోరణులు ఇందుకు కారణమవుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల్లో కూడా స్టాక్‌ మార్కెట్‌ తరహా ట్రేడింగ్‌ను అనుమతించారు. ఇలాంటి గ్యాంబ్లింగ్‌ను ఆపాల్సిన సమయమిది. కానీ ఆర్‌బిఐ కొత్త బాస్‌ మాత్రం ఇలాంటి నిషేధానికి నో అంటారు. పెట్టుబడిదారులకు అనిశ్చిత పరిస్థితి ఉండగూడదంటూ సెలవిస్తున్నారు.
బ్యాంకింగ్‌, బీమా, పెన్షన్‌ నిధుల్లో సంస్కరణలు..
   
ఈ పార్లమెంట్‌ సమావేశంలోనే బ్యాంకింగ్‌, బీమా, పెన్షన్‌ నిధులు మొదలగు అనేక రంగాల్లో సంస్కరణల బిల్లులు ఆమోదానికి రానుండగా ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌ నియామకంతో సంస్కరణల వడ్డింపు మరింత పెరగనుంది. 

No comments:

Post a Comment