హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దమైనట్టే కనిపిస్తోంది.ఇందులో భాగంగానే కొత్త రాజధాని ఏర్పాటకు కేంద్రాన్ని రూ.5లక్షల కోట్ల రూపాయలు అడిగినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో వైపు ఎత్తుగడల్లో భాగంగానే చంద్రబాబు కొత్త రాజధానికి అయిదు లక్షల కోట్ల రూపాయలు కావాలని అడిగారనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వుంటుందనీ, వైఎస్ఆర్సీపీ మరికొన్ని ఓట్లను చీల్చుకుంటుందనీ, రాజధాని అభివృద్ధి విషయంలో విజన్ వున్న నేతగా తనపట్లే ఓటర్లు మొగ్గు చూపిస్తారనే ఆశతో చంద్రబాబు వున్నట్టు తెలుస్తోంది.
భాగ్య నగరంపై మమకారం..
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో జన్మించిన్నప్పటికీ, కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, బాబు కొన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్లోనే వుంటున్నారు. ఇతర ముఖ్యమంత్రుల కంటే హైదరాబాద్ను తానే ఎక్కువ అభివృద్ధి చేశానని తరచూ చెప్పుకుంటూ వుంటారు. హైదరాబాద్ మీద ఆయనకు మమకారమూ ఎక్కువే. అలాంటప్పుడు ఆయన హైదరాబాద్ను వదిలి వెళ్లగలరా? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.హైదరాబాద్ మీద మమకారం చంపుకోలేకపోతే ఆయన తెలంగాణ రాజకీయాల్లో వుండిపోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చంద్రబాబునాయుడు తదుపరి రాజకీయ జీవితాన్ని ఎక్కడ గడుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. తొమ్మిదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, పదేళ్లపాటు ప్రతిపక్షనాయకుడిగానూ పనిచేసిన చంద్రబాబునాయుడికి రాష్ట్రమంతటా సంబంధాలున్నాయి. మామ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడానికి పూర్వమే రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు.
తెలంగాణలో గుడ్ విల్ సంపాదించుకోవడం, సీమాంధ్రలో విజన్ వున్న నేతగా ప్రచారం చేసుకోవడం, దేశ రాజకీయాల్లో విశ్వసనీయత పెంచుకోవడం వల్ల తనకీ, టీడీపీకి బంగారు భవిష్యత్ వుంటుందనే అంచనాతో చంద్రబాబు వున్నట్టు తెలుస్తోంది.
కుమారుడికి పార్టీ పగ్గాలు...
రాష్ట్ర విభజన ఖాయమవుతున్న సమయానికి కుమారుడు లోకేష్ చేతికొచ్చారు. ఆయన కూడా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నారు. క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుప్పం నియోజకవర్గంతో సంబంధాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. హీరో బాలకృష్ణ కు, కుమారుడు లోకేష్కు సీమాంధ్ర రాజకీయాలు అప్పగించి, చంద్రబాబు తెలంగాణలో సెటిలైపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో సీఎం పదవి కోసం చంద్రబాబు, సీమాంధ్రలో సీఎం పదవి కోసం లోకేష్ లేదా బాలకృష్ణ పోటీ పడితే తండ్రీకొడుకుల స్వలాభాల కోసమే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నారనే అపవాదును కూడా మూటగట్టుకోవాల్సి వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈరెండు కారణాల వల్ల చంద్రబాబు తెలంగాణలో సెటిల్ కాకపోవచ్చు. కాబట్టి, తన పట్ల పూర్తి విధేయులుగా వుండేవారికి తెలంగాణలో పార్టీ పగ్గాలు అప్పగించి, తెలంగాణలో కూడా పార్టీని పూర్తిగా తన కనుసన్నల్లో నడిచేలా జాగ్రత్త పడతారనేది మరికొందరి విశ్లేషణ. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల్లో గుడ్విల్ సంపాదించుకోవచ్చని, అది భవిష్యత్లో ఉపయోగపడుతుందనే అంచనాతో చంద్రబాబు వున్నట్టు తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో....
సీమాంధ్రలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత నిదానంగా లోకేష్కి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి, తాను జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే ఆలోచనతో చంద్రబాబు వున్నారనే ప్రచారం టీడీపీలో వినిపిస్తోంది. తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటే జాతీయ రాజకీయాల్లో సైతం తన విశ్వసనీయత పెరుగుతుందనే అంచనాతో చంద్రబాబు వున్నట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో విశ్వసనీయత పెంచుకుంటే, కాలం, అదృష్టం కలిసొస్తే ఏకంగా ప్రధాని పీఠమో, ఉప ప్రధాని యోగమో లభిస్తుందనే ఆశ కూడా చంద్రబాబును ఊరిస్తోంది.
తెలంగాణలో తమ్ముడికి....
తెలంగాణ పార్టీ నాయకత్వాన్ని నమ్మకస్తుడైన తమ్ముడికి అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇక మిగిలిన పనుల్లో తాను బిజీ అయిపోవాలని చూస్తున్నారు. వీటిలో మొదటిది సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికోసం పోటీపడడం. తనకు తొమ్మిదేళ్ల పాలనా అనుభవం వున్నదనీ, అభివృద్ధి విషయంలో తనకే స్పష్టమైన విజన్ వున్నదనీ, హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తరహాలోనే కొత్త రాజధానిని అభివృద్ధి చేయగలనని,అవసరమైతే విదేశీ నిధులు, ప్రపంచబ్యాంక్ నిధులు కూడా తీసుకురాగలనని ప్రచారం చేయడం ద్వారా సీమాంధ్రలో క్లీన్స్వీప్ చేయొచ్చనే అంచనాతో చంద్రబాబు వున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే, రాజకీయంగా ఇది ఏమంత తెలివైన నిర్ణయం కాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్పై మమకారంతో తెలంగాణలో సెటిలైనా, ఆయనను రాయలసీమకు చెందిన నేతగానే చూస్తారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో వుండే మనోభావాలవల్ల ఓటర్లు ఆయనను ముఖ్యమంత్రిగా అంగీకరించకపోవచ్చనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మరి అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

No comments:
Post a Comment