Tuesday, August 6, 2013

కమిటీ నంబర్..(?)

హైదరాబాద్: ఇదీ.. ఆటంటే! కాంగ్రెస్ ఆడే 'తెలంగాణ' గేమ్ మీదకు ఏ ఆటా రాదు. మ్యాచ్ ముగిసిపోయినట్లే అనిపిస్తుంది.. అంతలోనే కొత్త ఇన్నింగ్స్ మొదలువుతుంది. ఆరంభం..
అంతం అనేవి లేకుండా సాగుతున్న 'రాష్ట్ర విభజన' మ్యాచ్ లో అంతా తానై వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో అంకానికి తెరతీసింది. దానికి 'కాంగ్రెస్ హైపవర్ కమిటీ' అని నామకరణం చేసింది.
ప్రణబ్ కమిటీ నుంచీ...
  
తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలకు లెక్కే లేదు. తొలుత ప్రణబ్‌ కమిటీ.. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ.. అఖిలపక్షాలు.. కోర్‌కమిటీ భేటీలు.. రూట్‌మ్యాప్‌లు.. సీడబ్ల్యూసీ తీర్మానాలు ఇవన్నీ సుదీర్ఘంగా సాగాయి. నిర్ణయం వెలువడింది. వెంటనే సీమాంధ్ర అలజడి.. ఈ అంకాన్ని ముగించడానికి మరో కొత్త కమిటీ. దానికి ''కాంగ్రెస్‌ హైపవర్‌ కమిటీ'' అని పేరు పెట్టారు. ఈ ఇన్నింగ్స్ ఎంత కాలం సాగుతుందో..? అసలు దీనికి ముగింపు ఉందా..? లేక మరో కమిటీకి దారిచూపుతుందా..?? అన్న సంగతి ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. అసలు ఇదంతా హైకమాండ్‌ స్క్రిప్టేనని, ఈ కమిటీ రిపోర్టు ఎలా ఉండాలో కూడా ముందే డిసైడ్ అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సబ్ కమిటీ అన్నారు..! 'హైపవర్' వేశారు..!!
   
తెలంగాణాపై సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత... కేబినెట్‌ సబ్‌కమిటీ వేస్తామన్నారు. కానీ.. దాని కంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ ఒక హైపవర్‌ కమిటీ వేసింది. విభజనపై హైకమాండ్‌ నిర్ణయం తర్వాత.. సీమాంధ్రలో చెలరేగిన నిరసన ఉద్యమమే దీనికి కారణం. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హస్తినలో చక్కర్లు కొట్టి కొట్టి చివరకు.. ఇదొక కమిటీ ఏర్పాటు చేయించారు. ఇందులో ఆంటోని, దిగ్విజయ్‌సింగ్‌, అహ్మద్‌పటేల్, వీరప్ప మొయిలీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు విభజన పెండింగ్‌లోనేనని సీమాంధ్ర నేతలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ కమిటీ ఏం చేస్తుంది? ఏం చూస్తుంది? సమైక్యాంధ్రనే సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో ఆందోళనలు అదే రేంజ్‌లో జరుగుతున్నాయి. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్నారు. దానికి ఉన్న నిబంధనలేంటనేది క్లారిటీ లేదు.హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన సీమాంధ్రుల పరిస్థితేంటి? ఉద్యోగుల్లో వస్తున్న సందేహాలకు సమాధానాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వీటన్నిటినీ ఈ కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పల్లం రాజు తెలిపారు.
హైదరాబాద్ సంగతేంటి..?
   
విభజన తప్పనిసరైతే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ఉండవల్లి వంటి నేతలైతే భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కోరుతున్నారు. వీటన్నిటిపై కూడా ఈ కొత్త కమిటీ అధ్యయనం చేస్తుంది. గ్రేటర్‌ రాయలసీమ డిమాండ్‌, నీటి పంపకం, విద్యుత్‌, సహజవనరుల సంగతులు ఇలా అన్నిటిపై ఈ కమిటీ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదా మూడు ముక్కలు చేసి ప్రత్యేక రాయలసీమగా మా ప్రాంతాన్ని ప్రకటించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.
హైదరాబాద్‌పై వచ్చే ఆదాయం తెలంగాణాకేనన్న డిమాండ్‌..
   
హైదరాబాద్‌పై వచ్చే ఆదాయం తెలంగాణాకే దక్కాలని.. తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుందని వారు అంచనా వేస్తున్నారు. సీమాంధ్రులు అధికంగా ఉన్నది హైదరాబాద్‌లో... సమస్యంతా ఇక్కడేనని, ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటే తెలంగాణ ఇచ్చి ఉపయోగం ఏంటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలన్నిటికి సమాధానాలు వెతికే పని కూడా ఈ కమిటీపై పడింది.మొత్తం మీద రాష్ట్ర విభజన కసరత్తు మామూలుగా లేదు. ఎన్ని కమిటీలు వేసినా అసలు సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. మరి ఈ నేపథ్యంలో వచ్చిన కమిటీ అయినా పరిష్కారం కనుగొంటుందో..? లేదో..? ఇది సరేగని.. తెలంగాణ కోసం వేసిన కమిటీల్లో ఈ కమిటీ నంబర్ ఎంతో కనీసం వేసిన వాళ్లకైనా తెలుసా..?!

No comments:

Post a Comment