లక్షల కోట్లు దోచుకున్నారు.. తెలంగాణపై మాట తప్పారు.. జైలు నుంచి శాసిస్తూ పార్టీని నాశనం చేశారు.
'' వైసిపి ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ... జైలు నుంచి సలహాలు ఇస్తూ జగన్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు...
లక్షల కోట్లు దాచుకున్నా జగన్ కు తెలంగాణ పై మాట మార్చడం పెద్ద విషయం కాదు.'' అంటూ జగన్ పై కొండా సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మడమ తిప్పడం.. మాటతప్పడం జగన్ ఎజెండా అని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశం వైసిపిలో పెద్ద చిచ్చే పెట్టింది. సమైక్యాంధ్రకు మద్దతుగా కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడ్డారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సమావేశమయ్యారు. పార్టీ వైఖరి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉందని భావించిన వైసిపి తెలంగాణ ప్రాంత నేతలు విస్మయానికి గురయ్యారు. తమను అవసరానికి వాడుకున్నారని భావించిన తెలంగాణ ప్రాంత వైసిపి ముఖ్యనేత కొండా సురేఖ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా...
గౌరవనీయులైన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి....
''మాట తప్పం.. మడమ తిప్పం ఇది వైఎస్ ఆర్ లక్ష్యం..
మాట తప్పడం.. మడమ తిప్పడం.. లక్షల కోట్ల సంపాదన మీ లక్ష్యం''
నిబద్ధత కలిగిన రాజకీయాలంటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండడం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఉండేవారు. అయితే మీకు మాట తప్పడం మడమ తిప్పడమే రాజకీయం.లక్షల కోట్ల సంపాదన కోసం మీరు అనుసరిస్తున్న విధానం ఇదే.
వైఎస్ హఠాత్మరణం తర్వాత ఆయన కుటుంబానికి అండగా నిలవాలని ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన కుమారుడైన మిమ్ములను సిఎం చేయాలనే ఆకాంక్షతో మీకోసం మంత్రి పదవిని తృణప్రాయంగా ఒదులుకున్నాను. దాని తర్వాత జరిగిన పరిణామంలో నా భర్త కొండా మురళీధర రావు మీకు మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్సీ పదవిని, నేను ఎమ్మెల్యే పదవిని కోల్పోయాం. రాజకీయంగా అటు ప్రజలకు సేవ చేయలేని స్ధితిలో అన్నివిధాలా నష్టపోయాం. మహబూబాబాద్ లో ఓదార్పు యాత్ర సందర్భంలో అప్పుడు అన్ని పార్టీలు ఒక్కటై మీకు అండగా నిలిచినందుకు నాభర్తను , నన్ను భౌతికంగా లేకుండా చేద్దామని మామై దాడి చేశారు. గడిచిన ఈ నాలుగు సంవత్సరాల్లో మమ్ములను నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలు ఎంతో నష్టపోయారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, నా భర్త ఎమ్మెల్సీ పదవులు పోయినా మేము అంతగా భాధపడలేదు. మా కష్టాలు మేము అనుభవించాం. కానీ తెలంగాణ మీద మీరు ఇడుపులపాయ ప్లీనరీలో వైఎస్ ఆర్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాటకు, చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటారనుకున్నాం. ఇదే విషయాన్ని16 మంది మన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు సమర్పించినపుడు అయోమయ స్ధితి నెలకొనడంతో తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని విజయమ్మ గారిని మేము కోరాం. తెలంగాణకు అనుకూలంగా పార్టీ స్టాండ్ ఉంటుందని, గతంతో ఇడుపులపాయలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని, తెలంగాణను ఇస్తే అడ్డుకోబోమని విజయమ్మగారిని బహిరంగంగా ఒక ప్రకటన చేయమని కోరాం. అయితే ఆమె స్పందించలేదు. సమైక్యాంధ్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు ఓ సమాచార పత్రాన్ని మాకు అందించారు. గతంతో చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నది, చేస్తున్నదేమిటి..?ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో మన పార్టీ సానుకూలంగా లేకపోగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ సమైక్యాంధ్రకు మద్దతు పలకడం మాకు చాలా భాధ కలిగించింది. తెలంగాణ ప్రాంత మన పార్టీ నేతలను సంప్రదించకుండానే మీరిలా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో స్పష్టం చేయాలి. మీ వైఖరితో తెలంగాణ బిడ్డలుగా మా ఆత్మాభిమానం దెబ్బతింది.
మన పార్టీ తరపున ఒక ఎమ్మెల్సీ స్ధానానికి భర్తీ చేసే అవకాశం రాగా అది నా భర్తకు తెలంగాణ నుంచి ఇవ్వమని అడిగాను. కాని మీరు ఆ పదవిని మాకు ఇవ్వకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అప్పుడే పార్టీ మారిన వ్యక్తికి ఇచ్చినారు. అయినా మేం బాధపడలేదు. మీతో ఉన్నాక మేము రాజకీయంగా, ఆర్ధికంగా ఎంతో నష్టపోయా. మేము కాకుండా మమ్మల్ని నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నష్టపోయారు. కానీ తెలంగాణ మీద మీరు అనుసరిస్తున్న వైఖరి మా ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసింది.
లోటస్ పాండ్ లోని మన పార్టీ ఆఫీసులో గతంలో మన పార్టీ మీటింగ్ లో నన్ను స్టేజిపై విజయమ్మ పక్కన కూర్చోబెట్టి తర్వాత కొన్నాళ్లకు కింద కూర్చోబెట్టారు. అయినా అది పద్ధతా అని ఏనాడూ మనస్తాపం చెందలేదు.
మన పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ...
మీరు జైలుకు వెళ్లిన తర్వాత మన పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది.ప్రజాబలం లేని కొందరు నాయకులు బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ అమ్ముకోవడానికి బేరం పెడుతున్నారు.అలాంటి వారిని మీరు నమ్మి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.గతంలో వైఎస్ఆర్ వెంట ఉన్న వారిని పక్కన బెట్టి పార్టీ కోవర్టులను, ప్రజల్లో బలం లేని వారికి పార్టీలో పెత్తనాన్ని ఇస్తున్నారు.
తెలంగాణ పట్ల మన పార్టీ విధానం ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల మన పార్టీ విధానాన్ని మార్చుకున్నారా?...రెండు సంవత్సరాల క్రితమే మన పార్టీ తొలి ప్లీనరీ ఇడుపుల పాయ సమావేశంలో తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం ఉందని,కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే అభ్యంతరం తెలుపమని తీర్మానించాం.అయితే మన పార్టీ16మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు కాదా.మరి మన పార్టీ ప్లీనరీలో ఒక తీరుగా,ఇప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తూ మాట తప్పలేదా..
గతంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తే అనుకూలంగా ఉంటామని,వ్యతిరేకించమని స్పష్టం చేసిన విషయం మరచిపోయారా?..మేము ఉప ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ప్రచారం చేయడానికి వచ్చిన మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తామని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే అడ్డుకోబోమని స్పష్టం చేసి తెలంగాణ అమరులకు నివాళులు కూడా అర్పించారు.అయితే ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు.
తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తుందంటే మేము అడ్డు తగిలి ఆత్మాభిమానాన్ని చంపుకోలేము.తెలంగాణ ప్రాంత నేతలైన మాకెవరికి తెలియకుండా ఏక పక్షంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఎంత వరకు సమంజసం. సమైక్యాంధ్ర కోసం వారు తీసుకున్న రాజీనామా నిర్ణయం పార్టీదా?లేదా వారి వ్యక్తిగతమా?స్పష్టం చేయాలి. ఈ విషయాన్ని విజయమ్మతో జరిగిన సమావేశంలో అడిగినప్పటికి ఆమె ఏమీ చెప్పలేదు.ఇంతకీ మన పార్టీ సమైక్యవాద పార్టీనా? లేదంటే తెలంగాణ వాదాన్ని బలపర్చే పార్టీనా?మీరే చెప్పాలి...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలాగో వస్తుందని,రాష్ట్ర విడిపోవడం ఖాయమని అనుకున్న మీరు సీట్లు ఓట్ల గురించి మన పార్టీ విధానాన్ని మార్చుకున్నారా?ఆ కొత్త స్టాండ్ ఏమిటో చెప్పాలి.
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందితే సీమాంధ్ర ప్రాంతం కన్నా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ మంది బాధతో చనిపోయారు.అలాంటి వారిపై మీకు ప్రేమ లేదా?
తెలంగాణ ఉద్యమం కోసం వెయ్యిమంది యువకులు ప్రాణత్యాగం చేస్తే ఈ విషయాన్ని మన పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదు.దీనిపై స్పందనే లేదు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో మన పార్టీ విధానం ఏమిటి?గతంలో ఇడుపులపాయలో తీసుకున్న తీర్మానానికే కట్టుబడి ఉన్నామా?లేదా?ఇచ్చిన మాట మరిచి సమైక్య వాదం వైపు మొగ్గు చూపుతున్నామా?మీరే స్పష్టం చేయాలి.
No comments:
Post a Comment