ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్ (88) కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన లండన్ లో గుండెపోటుతో మరణించారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో 1923 సెప్టెంబర్ 26న దేవానంద్ జన్మించారు. 'హమ్ ఏక్ హై'చిత్రంతో 1946లో ఆయన బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న దేవానంద్ కు 'గైడ్' చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సుమారు 110 చిత్రాల్లో నటించిన ఆయన హీరోగానే కాకుండా దర్శక, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. 19 చిత్రాలకు దర్శకత్వం వహించటమే కాకుండా, 35 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వయసు పైబడినా అలుపు సొలుపు లేకుండా దేవానంద్ గత ఏడాది చార్జీషీటు చిత్రాన్ని రూపొందించారు.
దేవానంద్ 2001లో పద్మభూషన్ పురస్కారాన్ని, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన నట ప్రస్థానంలో ‘గైడ్’, 'పేయింగ్ గెస్ట్', ‘బాజీ’, ‘జ్యువెల్ థీఫ్’, 'సీఐడీ', జానీ మేరా నామ్, అమీర్ గరీబ్, వారెంట్ వంటి చిత్రాలు మంచి హిట్స్ అందించాయి. ‘హరే రామ హరే కృష్ణా’, ‘దేశ్పర్దేశ్’లను ఆయన విజయవంతంగా తెరకెక్కించారు. నేటి తరం నటులకు ఆదర్శంగా నిలిచిన దేవానంద్ మృతికి బాలీవుడ్ ప్రముఖలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
No comments:
Post a Comment