Wednesday, February 23, 2011

ప్రముఖ సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ కన్నుమూత

 ప్రముఖ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నైలోని అభిరామపురంలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. ఆయన కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. ప్రముఖ దర్శకులు బాపు, ముళ్లపూడి వెంకటరమణ ప్రాణ స్నేహితులు. వీరిద్దరి సమష్టి కృషి తెలుగు ప్రజలకు పలు విజయవంతమైన చిత్రాలను అందించింది. సాక్షి, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, రాధాగోపాళం తదితర సినిమాలకు రమణ రచయితగా పనిచేశారు. మూగమనసులు సినిమాకు కథాసహకారం అందించారు. రక్తసంబంధం మాటల రచయితగా, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన పిల్లల పుస్తకం 'బుడుగు' తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం పొందింది. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రమణ 'దాగుడుమూతలు' సినిమాతో పూర్తిస్థాయి సినీ రచయితగా మారారు. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత. ఆయన రాసిన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' విశేషంగా పాఠకాదరణ పొందింది. ముళ్లపూడి వెంకట రమణ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

2 comments:

  1. వ్యాసంలో చిన్న పొరపాటు దొర్లింది. సవరించగలరు.
    పంచదార చిలక కాదు...బంగారు పిచిక. చంద్రమోహన్,విజయనిర్మలనటించారు.ఇదే కధాంశాన్ని మళ్ళీ కొత్త నటీనటులతో బాపు రమణలే తీసారు..పెళ్ళికొడుకు అనే పేరుతో

    ReplyDelete
  2. nandana vanam loni kalpavriksham kommallapai kommachchi aata adataniki pilichuntaaru

    v s n prasad

    ReplyDelete