Thursday, August 6, 2015

అమ్మపాలే అమృతం

ఇటీవల కాలంలో ఎన్నో  ప్రత్యేకమైన రోజులను మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నాం. కానీ, వాటన్నింటికీ భిన్నమైంది ఆగస్టు 1 నుండి  7 వరకూ జరుపుకునే తల్లిపాల వారోత్సవం. ఎందుకంటే ఇది
తల్లిబిడ్డల ఆరోగ్యానికే కాదు, సమాజాభివృద్ధికి కూడా అవసరమైంది.  ఈ అనంత విశ్వంలో ఎన్నింటికో అర్థాలు మారుతున్నాయి. మరెన్నో రూపాలు మార్చుకుంటున్నాయి.  ప్రకృతి ప్రసాదించే స్వచ్ఛమైన గాలి, నీరు కూడా కల్మషంగా మారిపోయాయి. కానీ, ఏ స్థితిలోనూ, ఎట్టిపరిస్థితుల్లోనూ కల్మషం కానిది అమ్మతనమే. నేటికీ అమృతంతో సమానంగా,  దివ్యౌషధంగా మిగిలింది అమ్మపాలు మాత్రమే.
మనదేశంలోనూ 1992 లో శిశు ఆహార చట్టానికి రూపకల్పన జరిగి, 1993 ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చింది. తల్లిపాల సంస్కృతి అంతరించడానికి ఆధునిక ఆసుపత్రులు కొంతవరకు దో్హదం చేశాయి. గ్రామాల్లో, ఇళ్లల్లో కాన్పులు అయ్యే స్త్రీలు ఎక్కువగా తల్లిపాలు పట్టడం, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో కాన్పు అయ్యే స్త్రీలు ఎక్కువగా పోతపాలు పట్టడం జరుగుతోంది. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. దీని ఫలితమే 1992 లో ఆరంభమైన ప్రపంచ వ్యాప్త శిశు మైత్రీ ఆసుత్రుల ఉద్యమం.
తల్లిపాలు  తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలకు గురయ్యే అవకాశం తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశు మరణాల రేటుతగ్గించవచ్చని అంచనా. తల్లిపాల వల్ల శిశువుకే కాదు, తల్లికికూడా లాభాలున్నాయి.
ఏ మందులూ నయం చేయలేని ఆరోగ్యసమస్యలు, ఏ వైద్యుడూ బాగుచేయలేని వ్యాధులు అమ్మపాలకి తలొగ్గుతాయి. బిడ్డకు ఆయురారోగ్యాలను అందిస్తాయి. తల్లీబిడ్డల మధ్యల అనుబంధాన్ని పెంచుతాయి... విలువైన ఈ విషయాలను కాబోయే అమ్మలు కూడా తెలుసుకోవాలి. పుట్టబోయే బిడ్డకు వీలున్నన్ని రోజులు పాలిచ్చేందుకు సిద్ధపడాలి. పుట్టిన ప్రతి శిశువూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి.

No comments:

Post a Comment