Wednesday, May 27, 2015

ఆరోగ్యవంతమైన బిడ్డను కని మురిసిపోవాల్సిన స్త్రీలు

ఆరోగ్యవంతమైన బిడ్డను కని మురిసిపోవాల్సిన స్త్రీలు ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో గర్భం దాల్చినప్పటికీ దానిని కాపాడుకోలేకపోవడమో, నెలలు నిండకుండా బిడ్డను పోగొట్టుకుని వేదనకు గురికావడమో జరుగుతున్నది.
దీనికి కారణం గర్భం దాల్చినప్పటి నుంచి వైద్య పరీక్షలు, సేవించాల్సిన ఔషధాల మీద తీసుకుంటున్న శ్రద్ధ గర్భస్థ శిశువు ఎదుగుదలకు కారణమయ్యే ఆహార పదార్థాల మీద తీసుకోకపోవడమే.
            గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యేలోగా గర్భిణీ స్త్రీ ఐదు నుంచి ఆరు కిలోల బరువు పెరగాలి. అందులో శిశువు శరీర బరువు 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు ఉంటే ప్రసవం సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి.
                సాధారణంగా గర్భం దాల్చినప్పటి నుంచి మొదటి మూడు నెలల పాటు ఎక్కువగా ద్రవ, చల్లని, తీయని ఆహారపదార్థాలను సేవించాలి. పాలు, చక్కెర కలిపి కాని, పాలలో తేనె కలిపి కాని ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువసార్లు సేవించాలి. మెత్తగా ఉడికిన అన్నం, ఆకుకూరలు లేదా ఉడికిన కూరగాయల ముక్కలతో తక్కువ మోతాదులో ఎక్కువసార్లు, కనీసం ఐదారుసార్లు భుజించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు వేపుళ్ళు, మసాలా కూరలు తీసుకోకపోవడమే మంచిది.
              నాలుగో నెల ఆరంభమయ్యే వరకు స్త్రీలకు బడలిక, నీరసం ఎక్కువగా ఉంటాయి. కనుక దానిమ్మ పళ్ళను, చిట్టీతపళ్ళను సేవిస్తే బడలిక, నీరసం నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాక నోటికి రుచిని, సేవించిన ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకునే శక్తిని కలిగిస్తాయి.
             గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో వాంతి వచ్చినట్టు ఉండటం, పుల్లగా త్రేన్పులు రావడం, కొద్దిమందిలో ఎక్కువ సార్లు వాంతులు కావడం వంటివి ఉంటాయి. ఇటువంటి సమయాల్లో మాదీఫల రసాయనమనే ఔషధం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. భోజనానికి ముందు 10 మి.లీ. చొప్పున రోజుకు మూడు పర్యాయాలు సేవించాల్సి ఉంటుంది.
సాధారణంగా మొదటి రెండు నెలల్లో ఆకారం లేకుండా ముద్దలాగా ఉన్న పిండానికి మూడవ నెల నుంచి శిరస్సు, కాళ్ళు, చేతులు, హృదయం ఏర్పడటర ఆరంభమవుతుంది. కనుక సేవించాల్సిన ఆహార పదార్థాల మోతాదు కొంచెం పెంచాల్సి ఉంటుంది. అంతేగాకుండా, ద్రవ రూప ఆహారంతో పాటు ఘన రూప ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. దీనికోసం బియ్యం ఒక భాగం, పెసరపప్పు సగభాగం, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నెయ్యి, తగినంత ఉప్పు వేసి మృదువుగా ఉడికించి తీసుకోవాలి. ఇలాంటి ఆహారాన్ని వీలైనన్ని రోజులు .. మిగిలిన రోజూవారీ ఆహార పదార్థాల బదులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
                  నాలుగవ నెల నుంచి శిశువు శరీర అవయవాల వృద్ధి అధికంగా ఉంటుంది. కనుక ఈ నెల నుంచి మాంసాహారాలను సేవించాలి. ఆహారపదార్థాలకు కాచిన పాలనుంచి తయారు చేసిన వెన్నను రోజుకు 16 గ్రాముల చొప్పున చేర్చి మూడు నాలుగు సార్లుగా విభజించి సేవించాలి. ఎన్ని రకాల ఆహారపదార్థాలున్నప్పటికీ ప్రత్యేకంగా వెన్నను మాత్రమే అధికంగా సేవించాలని చెప్పిన కారణమేమిటంటే శిశువు శరీరాభివృద్ధికి తోడ్పడే అన్ని రకాల పోషకాంశాలతో పాటు అధిక మొత్తంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి.
                 మాంసరసాలలో కూడా ప్రత్యేకంగా సరిపోయే ఐరన్‌ ధాతువు లభించడం వల్ల గర్భిణీ స్త్రీ రక్తహీనతకు లోనుకాకుండా ఉంటుంది. మాంస రసాలు తీసుకోని వారు బియ్యం, గోధుమలు, బార్లీ మెత్తని పొడి చేసి ఎక్కువ నీటితో ఉడికించి, జీలకర్ర, మిరియాలు, వెన్న కలిపి సేవించాలి.
                   శిశువు కండరాలు రక్తం వృద్ధి అధికంగా జరగడం ఐదవ నెల నుంచి ఆరంభమవుతుంది. మనస్సు తాలూకూ చర్య- అంటే ఆలోచనా శక్తి ఈ మాసం నుంచే ఆరంభమవుతుంది. ఈ మాసం నుంచి ప్రత్యేకంగా నెయ్యిని సేవిస్తే తల్లి శరీరానికి బలమే కాకుండా, ఎదిగే శిశువు మెదడుకు మంచి పోషణ కలుగుతుంది. మేధస్సు వృద్ధి చెందడానికి అవసరమైన శక్తి ఉత్తేజకాలను ఇస్తుంది. ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా దీనిలోని మాంసకృత్తులు తల్లిలో కలిగే మానసిక ఉద్వేగాలను నియంత్రించి రక్తపోటు రాకుండా నియంత్రిస్తాయి. రక్తంలోని చక్కెర శాతాన్ని క్రమబద్ధంగా ఉంచుతుంది.
           ఆరవ నెల నుంచి శిశువుకు తల వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, శరీర వర్ణం, బలం ఏర్పడుతాయి. దీంతో పాటు బుద్ధి కూడా ఈ మాసం నుంచి వృద్ధి చెందుతుంది. ఈ మాసం నుంచి పైన తెలిపిన ఆహార పదార్థాలతో పాటుగా పెరుగును అధికంగా చేర్చి సేవించాలి.
           చాలా మంది స్త్రీలు బిడ్డ మంచి శరీర రంగుతో పుట్టాలని గర్భం దాల్చిన నాటి నుంచి మార్కెట్‌లో చౌకగా లభించే కల్తీ కుంకుమ పువ్వు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల శిశువుకు అపాయం కలిగే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా 5వ నెల నుంచి 7వ నెల పూర్తయ్యేవరకూ కాశ్మీరి కుంకుమ పువ్వును 500 మిల్లీ గ్రాముల చొప్పున వెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రపోవడానికి ముందు సేవించాలి. ఇలా సేవించడం వల్ల శిశువుకు మంచి శారీరక వర్ణం ఏర్పడుతుంది.
          ఏడవ నెల నాటికి దాదాపుగా శిశువు శరీర కండరాలు, రక్తం, ఎముకలు పూర్తిగా వృద్ధి చెందుతాయి. ఈ నెల పూర్తయ్యేసరికి శిశువు శరీర నిర్మాణం కూడా పూర్తవుతుంది. క నుక ఈ సమయంలో తీసుకునే ఆహార పదార్థాల్లో తిప్పతీగ, సుగంధపాలు, శొంఠి, చిరుబెండ మొదలైన ఔషధాల చూర్ణాన్ని అన్నం లేదా మాంసంతో కలిపి ఉడికించి తినాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బిడ్డ నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి ఎదుగుదల సాధ్యమవుతుంది. గర్భంలోని బిడ్డ కదలికలను క్రమపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు ఏడవ నెల నుంచి బిడ్డ కదలికలను సరిగ్గా గుర్తించలేకపోవడం జరుగుతుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా, ఈ రకమైన ఆహారం ఉపకరిస్తుంది. ఎనిమిదవ నెల నుంచి చాలా మంది గర్భిణీల్లో పొత్తికడుపు బిగదీయడం, స్వల్ప మోతాదులో పొత్తికడుపు నొప్పి రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి వాటికి ఆముదపు గింజలను నలగగొట్టి పాలతో ఉడికించి వడగట్టి రాత్రి నిద్రపోవడానికి ముందు తగిన మోతాదులో తీసుకోవాలి. ఈ నెలలో తేలికపాటి ఆహారాన్ని సేవించాలి. ఎక్కువసార్లు బియ్యం, బార్లీ, గోధుమలను సమానంగా తీసుకుని పాలతో ఉడికించి సేవించాల్సి ఉంటుంది.
            తొమ్మిదవ నెలలో పైన పేర్కొన్న ఆహారంతో పాటుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు నువ్వుల నూనెతో పొత్తికడుపు, వీపు భాగం, నడుము, కాళ్లు పైనుంచి కింది వరకూ మృదువుగా మర్దన చేయించుకోగలిగితే మంచింది. ఇలా చేయడం వల్ల నడుము చుట్టూ, గర్భాశయ సంబంధ కండరాలు బిగదీయడం తగ్గి సుఖ ప్రసవానికి వీలవుతుంది.
గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకూ అధిక మోతాదుల్లో పాలు సేవించాలి. వాంతులు ఎక్కువ కావడం వల్ల క్షీణించిన బలాన్ని వృద్ధి చేయడం, శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను సమృ ద్ధిగా అందించడం పాల వల్లనే సాధ్యమవుతుంది. అంతేగాక పాలలో ఉండే గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, గలాక్టోజ్‌ వంటి చక్కెరలు, ప్రోటీన్లు తల్లి శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. శిశువు పెరుగుదలకు ఈ విధంగా అవసరమయ్యేంత మోతాదులో ఆహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించడం వల్ల .. ప్రసావనంతరం తల్లీబిడ్డ ఇద్దరూ కూడా సురక్షితంగా ఉంటారు.
            పెరుగులోని పోషకాంశాలు గర్భస్రావం జరగకుండా నివారిస్తాయి. (సాధారణంగా చాలామందికి ఆరవ నెలలో గర్భపాతం జరుగుతుంటుంది) పెరుగు తీసుకుంటే లావవుతారని అనేకమంది భ్రమపడుతుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. పెరుగును తగు మోతాదులో సేవించడం వల్ల తల్లికి, బిడ్డకు లాభమే.

No comments:

Post a Comment