Monday, September 16, 2013

అక్కడంతా నేత్రదాతలే!

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంత ప్రధానమైన నేత్రాలను దానం చేయడం అన్ని దానాలలోకీ గొప్పదంటారు. అంతటి గొప్ప దానాన్ని సంప్రదాయంగా మార్చుకున్న ఘనత మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌ గ్రామానికి
దక్కుతుంది. 1975లో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేసిన బీజం, ఇవాళ 4 వేల నేత్రదానాల సంఖ్యకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌ పట్నం ఒకప్పుడు గంజాయి సాగుకు పేరుమోసింది. అదే పట్నం ఇప్పుడు దేశంలో అత్యధిక నేత్రదానాలు చేస్తున్న పట్నంగా ప్రసిద్ధికెక్కింది. నీమచ్‌లో నివపించే ప్రజలు కుటుంబ సమేతంగా నేత్రదానానికి కట్టుబడి ఉండడం విశేషం.

దేశం మెత్తం మీద ఈ నీమచ్‌ పట్నంలోని దాతల వల్ల కనీసం మూడు వేల మంది కంటి వెలుగును పొందారు. ఒక దశాబ్దం క్రిందట, నీమచ్‌ పట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న బికేన్‌ గ్రామంలో ఘిసులరు పటేదార్‌ అనే వృద్ధ రైతు మరణించాడు. అతని నేత్రాలు దానం చేయదలచినట్లు ఆ రైతు కుటుంబ సభ్యులు నీమచ్‌ లయన్స్‌ క్లబ్‌ కు సమాచారం అందించారు. వైద్య బృందం హుటాహుటిన బయలుదేరి వెళ్ళింది. కానీ వెళ్ళేసరికి ఆలస్యం అయింది. చాలాసేపు ఎదురుచూసిన కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేయడానికి సిద్దమవుతుండగా వైద్య బృందం అక్కడికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఏ మాత్రం సందేహించ కుండా చితి నుండి భౌతిక కాయాన్ని దింపి, నేత్రాలు తొలగించేందుకు అంగీకరించారు. ఈ సంఘటన నీమచ్‌ పట్టణ ప్రజల గొప్పదనానికి ఒక మచ్చు తునక.
ఈ పట్టణంలో మొదటిసారిగా శ్యాముఖ్‌ గార్గ్‌ అనే స్వాతంత్య్ర సమరయోధుడు నేత్రదానం చేశారు. ఆయన మరణం తరవాత అతని మనవడికి ఆ నేత్రాలను అమర్చారు. అప్పటి నుండి గార్గ్‌ కుటుంబ సభ్యులు కేవలం వారి నేత్రాలను దానం చేయడంతో సరి పెట్టుకోకుండా కంటి చూపు లేని వారికి వెలుగును ప్రసాదించే నేత్రదాన బృహత్‌ కార్యక్రమ ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. మొదటగా వారి కుటుంబం, బంధుమిత్రులను, తరు వాత క్లబ్‌ సభ్యులను తలుపుకొని ప్రచారం చేయడం ఆరంభించారు.
ప్రజలను ఒప్పించడంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొ న్నారు. ఈ జన్మలో కళ్ళు దానం చేస్తే వచ్చే జన్మలో అంధులుగా పుడతామన్న మూఢ నమ్మకం జనాల్లో పాతుకుపోయి ఉండేది. ఆ నమ్మకాలు తప్పని ఒప్పించడానికి గార్గ్‌ కుటుంబ సభ్యుల బృందం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ 4000 వేల సంఖ్యకి చేరిందంటే వారి పట్టుదల ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశానికే ఈ పట్టణం ఆదర్శంగా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. వీరిని ప్రేరణగా తీసుకుని దేశంలో చాలా మంది వీరి బాటలో నడుస్తున్నారు.ఇందులో ప్రముఖులు కూడా ఉండడం విశేషం.
వ్యక్తి మరణించాక ఆరు గంటల లోపు నేత్రాలను తొలగించ వలసి ఉంటుంది. ఆ విధంగా తొలగిం చిన నేత్రాలను థర్మాస్‌ ఫ్లాస్క్‌లో భద్రం చేసి, కొద్ది గంటల్లో మరొకరికి అమర్చాల్సి ఉంటుంది. నీమచ్‌లో మొదట్లో భద్రం చేసిన నేత్రాలను నిల్వ చేసే సౌకర్యం ఉండేది కాదు. దానం చేయబడిన నేత్రాలను 250 కి.మీ. దూరంలో ఇండోర్‌, జైపూర్‌లకు పంపించాల్సి వస్తుండేది. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక వ్యాపార వేత్త జి.డి అగర్వాల్‌ 1992లో గోమాబారు కంటి ఆసుపత్రిని నీమచ్‌లో స్థాపించారు. కేవలం నేత్రాల భద్రత, దానం చేసిన కళ్ళను తిరిగి అమర్చడమే కాక, క్యాటరాక్ట్‌, గ్లాకోమా లాంటి కంటి సంబంధమైన జబ్బులకు చికిత్సను కూడా అందిస్తున్నారు. పేదవారి కోసం ఉచితంగా ఆ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఆసుసత్రి ద్వారా నేత్రదాన ప్రచారం కూడా చేస్తున్నారు. వ్యక్తి చనిపోగానే ఆసుపత్రి వర్గాలకు టెలిఫోన్‌ ద్వారా నేత్రాల తొలగింపునకు సమాచారం అందిస్తారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్కడి ప్రజలు ఈ సంస్కృతికి కట్టుబడి ఉన్నారో అర్థం అవుతుంది. నీమచ్‌ను ఆదర్శంగా తీసుకుని దేశంలోని ఇతర ప్రాంతాలూ ఈ బాటలో పయనిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంది!

No comments:

Post a Comment